ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.

పేజీలు

11, మే 2010, మంగళవారం

25వ దినము, కిష్కింధకాండ

న చ ఆత్మానం అహం శోచే న తారాం న అపి బాంధవాన్ |
యథా పుత్రం గుణశ్రేష్ఠం అంగదం కనకాంగదం ||

కిందపడిపోయిన వాలి అన్నాడు " రామ! నేను నా ప్రాణములు పోతున్నాయి అని బాధపడడం లేదు, తార గురించి విలపించడం లేదు, కాని నా ప్రియాతిప్రియమైన కుమారుడు అంగదుడు సుఖాలకి అలవాటుపడి బతికినవాడు, ఈ ఒక్క కొడుకు భవిష్యత్తు ఏమవుతుందా అని బెంగపడుతున్నాను. నా కొడుకు యొక్క శ్రేయస్సుని, అభివృద్ధిని నువ్వే సర్వకాలముల యందు చూడాలి రామ " అన్నాడు.

అప్పుడు రాముడు " దండించవలసిన నేరము ఏదన్నా ఒకటి చేయబడినప్పుడు, ఆ దండనని అవతలి వ్యక్తి ప్రభుత్వం నుంచి కాని, రాజు నుండి కాని పొందితే, వాడి పాపం అక్కడితో పోతుంది. ఒకవేళ దండన పొందకపోతే ఆ పాపం ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. అందుచేత, వాలి నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు చేసిన మహా పాపానికి ఎప్పుడైతే శిక్ష అనుభవించావో, అప్పుడే నీయందు ఉన్న దోషం పోయింది. అందుకని ఇప్పుడు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గలోకాన్ని పొందడానికి నీకెటువంటి ప్రతిబంధకం ఉండదు. ఇప్పుడు అంగదుడు నిన్ను ఎలా చుసేవాడో, నీ తరవాత సుగ్రీవుడియందు, నాయందు అలాగే ఉంటాడు. పిన తండ్రివల్ల నీ కుమారుడికి సమస్య వస్తుందని అనుకోమాకు, అప్పుడు కూడా నీ బిడ్డని తండ్రిగా కాపాడడానికి నేను ఉన్నాను " అన్నాడు.

అలా వాలి కిందపడిపోయి ఉండడం వల్ల చుట్టూ ఉన్న వానరాలు పరుగులు తీశాయి. జెరుగుతున్న ఈ గందరగోళం విన్న తార బయటకి వచ్చి " మీరందరూ ఇలా ఎందుకు పరిగెడుతున్నారు " అని అడిగింది.

అప్పుడు ఆ వానరాలు " రాముడికి, వాలికి యుద్ధం జెరిగింది. వాలి పెద్ద పెద్ద చెట్లని, పర్వతాలని తీసుకొచ్చి రాముడి మీదకి విసిరాడు. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుద్ధం లాంటి బాణాలతో రాముడు ఆ చెట్లని, పర్వతాలని కొట్టేసాడు. ఆ యుద్ధంలో ఆఖరున రాముడు వాలిమీద బాణమేసి కొట్టేసాడు, అందుకని నీ కొడుకుని రక్షించుకో, పారిపో " అన్నారు.
( ఇదే లోకం యొక్క పోకడ అంటె. గొంతు మారుతున్న కొద్దీ నిజం అంతర్ధానమవుతుంది. )

అప్పుడు తార " భర్తపోయిన తరువాత నాకెందుకు ఈ రాజ్యము, ఈ కొడుకు " అని వాలి దెగ్గరికి పరిగెత్తింది.




అప్పుడా తార వాలితో " నేను నీకు చెప్పిన మాటలు నువ్వు వినలేదు, ఇప్పుడు ఈ పరిస్థితిని తెచ్చుకున్నావు. సుగ్రీవుడి భార్యని అపహరించి తెచ్చావు, కామమునకు లోంగావు " అని చెప్పి, కొన ఊపిరితో ఉన్న వాలిని చూసి విలపించింది. తండ్రి మరణిస్తున్నాడని అంగదుడు నేల మీద పడి భోరున ఏడుస్తున్నాడు.

అప్పుడు వాలి సుగ్రీవుడితో " సుగ్రీవా! నా దోషాలని లెక్కపెట్టకయ్యా. కాలం బలవత్తరమైన స్వరూపంతో తన ఫలితాన్ని ఇవ్వడానికి నా బుద్ధిని మొహపెట్టి, నీతో నాకు వైరం వచ్చేటట్టు చేసింది. ఈ ఫలితాన్ని అనుభవించడం కోసమని నీ నుండి నన్ను దూరం చేసింది. అన్నదమ్ములమైన మనిద్దరమూ కలిసి ఏకాకాలమునందు సుఖం అనుభవించేటట్టు భగవంతుడు రాయలేదురా సుగ్రీవా. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమయ్యింది, నీకు ఒక్క మాట చెప్పుకుంటాను సుగ్రీవ, ఇది మాత్రం జాగ్రత్తగా విను. నాకు ఒక్కడే కొడుకు అంగదుడు, వాడు ఇవ్వాళ నాకోసం భూమి మీద పడి కొట్టుకుంటున్నాడు. వాడు సుఖంతో పెరిగాడు, వాడికి కష్టాలు తెలియవు. నేను వెళ్ళిపోయాక వాడికి సుఖాలు ఉండవు కదా. నీ దెగ్గర, పిన్ని దెగ్గర ఎలా ఉండాలో వాడికి తెలియదు కదా. తార బతుకుతుందో లేదో నాకు తెలియదు. అందుకని నా కొడుకుని జాగ్రత్తగా చూడు, వాడికి నువ్వే రక్షకుడివి. తారకి ఒక గొప్ప శక్తి ఉంది సుగ్రీవా. ఎప్పుడైనా ఒక గొప్ప ఉత్పాతం వస్తే, అప్పుడు మనం ఏమిచెయ్యాలో నిర్ణయించుకోలేని స్థితి వస్తే, సూక్ష్మ బుద్ధితో ఆలోచించి చెప్పగలిగిన ప్రజ్ఞ తార సొత్తు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే తార సహాయం తీసుకో. నువ్వు ఎప్పుడైనా కాని రాముడిని అవమానించావ, రాముడి పని చెయ్యడంలో ఆలస్యం చేశావ, నేను వెళ్ళిన మార్గంలో నువ్వు కూడా వచ్చేస్తావు సుగ్రీవా. అందుకని జాగ్రత్తగా ఉండు. 

నాయనా సుగ్రీవ, నా తండ్రి అయిన మహేంద్రుడు ఇచ్చిన మాల నా మెడలో ఉంది, నా ప్రాణం కాని వెళ్ళిపోతే, ఈ శరీరం శవం అయిపోతుంది, అప్పుడీ మాల అపవిత్రం అవుతుంది. ఈ మాల జయాన్ని తీసుకొస్తుంది అందుకని నీకు ఇస్తున్నాను, తీసుకో " అని ఆ మాలని సుగ్రీవుడికి ఇచ్చి ప్రాణములను వదిలేశాడు.

అప్పుడు తార అనింది " ఎప్పుడూ నీ నోటివెంట ఒక మాట వచ్చేది. ' సుగ్రీవుడా, వాడిని చితక్కొట్టేస్తాను ' అనేవాడివి. చూశావ దైవ విధి అంటె ఎలా ఉంటుందో, ఇవ్వాళ ఆ సుగ్రీవుడు నిన్ను కొట్టేశాడు. ఒంట్లో బలం ఉందని లేచింది మొదలు సంధ్యావందనానికి నాలుగు సముద్రాలు దూకావు. ఇంటికొచ్చి మళ్ళి ఎవరినో కొట్టడానికి వెళ్ళేవాడివి. నీతో యుద్ధం చేసిన ఎందరో వీరులని ఇలా భూమి మీద పడుకోపెట్టావు, ఇవ్వాళ నువ్వు కూడా అలా పడుకున్నావు. శూరుడన్న వాడికి పిల్లని ఇస్తే, ఆమెకి హఠాత్తుగా వైధవ్యం వస్తుంది. అందుకని శూరుడికి ఎవరూ పిల్లని ఇవ్వద్దు. 
పతి హీనా తు యా నారీ కామం భవతు పుత్రిణీ |
ధన ధాన్య సమృద్ధా అపి విధవా ఇతి ఉచ్యతే జనైః ||
మాటవినే కొడుకులు ఎంతమంది ఉన్నా, అపారమైన ఐశ్వర్యం ఉన్నా, నేను గొప్ప పండితురాలినైనా, నువ్వు వెళ్ళిపోవడం వల్ల లోకం నన్ను చూడగానే మాత్రం విధవ అనే అంటుంది " అనింది.

అప్పుడు సుగ్రీవుడు రాముడితో " నువ్వు చేసిన ప్రతిజ్ఞకి అనుగుణంగా వాలిని సంహరించావు. అన్నని చంపమని నేను నిన్ను అడిగాను, నేను దుర్మార్గుడిని. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను ఎంత అకృత్యం చేశానో అని. అన్నయ్య బతికి ఉన్నంతకాలం, అన్నయ్య పెట్టిన కష్టాలు తట్టుకోలేక, అన్నయ్య పొతే బాగుండు, పొతే బాగుండు అని నిన్ను తీసుకొచ్చి బాణం వెయ్యమన్నాను. అన్నయ్య భూమి మీద పడిపోయాక, అన్నయ్య అంటె ఏమిటో నాకు అర్ధం అవుతుంది రామ.


నేను వాలి మీదకి యుద్ధానికి వెళితే, నన్ను కొట్టి, ఇంకొక్క గుద్దు గుద్దితే నేను చచ్చిపోతాను అన్నంతగా అలిసిపోయాక, ' ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యకే, పో ' అని వెళ్ళిపోయేవాడు, కాని నన్ను చంపేవాడు కాదు. ఒకతల్లి బిడ్డలమని నన్ను ఎన్నడూ వాలి చంపలేదు. నేను చచ్చిపోతానని వాలి నన్ను అన్నిసార్లు వదిలేశాడు, కాని నేను వాలిని చంపించేసాను. నీతో వాలిని చంపమని చెప్పినప్పుడు నాకు ఈ బాధ తెలియలేదు, కాని జెరిగినప్పుడు తెలుస్తుంది. అందుకని నాకు ఈ రాజ్యం వద్దు రామ.

పెద్ద చెట్టు కొమ్మని విరిచి తీసుకొచ్చి, దానితో నన్ను కొట్టి, ఇంక నేను ఆ దెబ్బలు తట్టుకోలేక పడిపోతే, ' ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పనులు చెయ్యకు, పో ' అనేవాడు. ఇవ్వాళ నన్ను అలా అనే అన్నయ్య ఎక్కడినుంచి వస్తాడు. ఇక నేను ఉండను, నేను అగ్నిలోకి వెళ్ళిపోతాను. రామ! మిగిలిన ఈ వానరులు నీకు సీతాన్వేషణలో సహాయం చేస్తారు " అన్నాడు.

సుగ్రీవుడు అలా ఏడుస్తుంటే చూడలేక రాముడు ఏడిచాడు. తార వాలిని కౌగలించుకొని ఎడుద్దాము అంటె, రాముడి బాణం వాలి గుండెలకి గుచ్చుకొని ఉంది. అప్పుడు నలుడు వచ్చి ఆ బాణాన్ని తీసేసాడు. అప్పుడా తార భర్త యొక్క శరీరం దెగ్గర ఏడిచాక, రాముడి దెగ్గరికి వచ్చి " రామ! నీగురించి ఊహించడం ఎవరి శక్యం కాదు. నువ్వు అపారమైన కీర్తికి నిలయమైన వాడివి. భూమికి ఎంత ఓర్పు ఉందో, రామ! నీకు అంత ఓర్పు ఉంది. నువ్వు విశాలమైన నేత్రములు కలిగినటువంటివాడివి. నీ చేతిలో పట్టుకున్న కోదండం, నీ అవయవముల అందమైన పొందిక, దానిలో ఉన్న కాంతి చూసిన తరువాత నువ్వు అందరివంటి మనుష్యుడవి కావని నేను గుర్తించాను. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప దానం, భార్యా దానం. నేను లేకపోతె వాలి అక్కడ కూడా సంతోషాన్ని పొందలేడు. అందుకని వాలిని ఏ బాణంతో కొట్టావో, నన్ను కూడా ఆ బాణంతో కొట్టు, నేనూ వాలి దెగ్గరికి వెళ్ళిపోతాను " అనింది.

అప్పుడు రాముడు " నువ్వు అలా శోకించకూడదమ్మా. కాలం అనేది ఒక బలమైన స్వరూపం, అది పుణ్యపాపాలకి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ వాలి శరీరం ఇలా పడి ఉండగా మీరందరు ఇలా మాట్లాడకూడదు. జెరగవలసిన క్రతువుని చూడండి " అన్నాడు.

తరువాత వాలి శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశారు.

తదనంతరం సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైన వానరములు రాముడి దెగ్గర కూర్చున్నారు. అప్పుడు హనుమంతుడు " ఇంతగొప్ప రాజ్యాన్ని సుగ్రీవుడు పొందేతట్టుగా నువ్వు అనుగ్రహించావు. అందుకని నువ్వు ఒక్కసారి కిష్కిందా నగరానికి వస్తే నీకు అనేకమైన రత్నములను బహూకరించి, నీ పాదాలకి నమస్కరించి సుగ్రీవుడు కృతకృత్యుడు అవుతాడు " అని అన్నాడు.

అప్పుడు రాముడు " 14 సంవత్సరాలు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యంలో ఉంటాను. నేను గ్రామంలో కాని, నగరంలో కాని ప్రవేశించి నిద్రపోను. పెద్దవాడైన వాలి యొక్క కొడుకైన అంగదుడు యోగ్యుడు, మీరు అతనికి యువరాజ పట్టాభిషేకం చెయ్యండి. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చెయ్యండి. మీరందరు సంతోషంగా కిష్కిందలో ఉండండి. ఈ వర్షాకాలంలో రావణుడిని వెతుకుతూ వెళ్ళడం కష్టం. సుగ్రీవా! పట్టాభిషేకం చేసుకొని 4 నెలలు యదేచ్ఛగా సుఖాలు అనుభవించు. కొండల మీద తిరిగి ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డావో. 4 నెలల తరువాత కార్తీక మాసం వచినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతవరకు నేను ఊరి బయట ప్రస్రవణ పర్వత గుహలో ఉంటాను " అని చెప్పి సుగ్రీవుడిని పంపించాడు.

కిష్కిందకి వెళ్ళాక సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు మళ్ళి తారని పొందాడు. అలా తార, రుమలతో బయట వర్షాలు పడుతుండగా సుగ్రీవుడు ఆనందంగా కాలం గడపసాగాడు.

3 కామెంట్‌లు:

  1. Hello Kesava,

    Site chala bagaundi. Manchi adyatmika literature ni ponduparichavu.

    Thanks a lot.

    Regards,
    Ramakrishna Kunta

    రిప్లయితొలగించండి
  2. నువ్వు ఎప్పుడైనా కాని రాముడిని అవమానించావ, రాముడి పని చెయ్యడంలో ఆలస్యం చేశావ, నేను వెళ్ళిన మార్గంలో నువ్వు కూడా వచ్చేస్తావు సుగ్రీవా. అందుకని జాగ్రత్తగా ఉండు.
    Protection of noble souls (irrespective of their backgrounds) and imrpvoving their living standards, and molding them as leaders across India/all over the world is very very important to enhance the ethical standards of humanity.

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama. Jai Sri Rama. Jai Sri Rama Rajjam.

    రిప్లయితొలగించండి